జక్కన్న మేకింగ్‌ మారింది.. కారణం పూరి సినిమా!

Rajamouli inspired by Businessman movie

ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ఆయన, టాలీవుడ్‌ గర్వంగా నిలిచాడు. తనను ఎప్పుడూ “పెర్ఫెక్ట్ డైరెక్టర్” అనుకోకుండా, ఇతరుల పనినుంచి నేర్చుకోవాలనే వైఖరితో ముందుకు సాగుతున్న రాజమౌళి, చిన్న చిత్రాలయినప్పటికీ విశేషంగా ప్రోత్సహిస్తుంటారు. ముఖ్యంగా పూరి జగన్నాథ్‌, సుకుమార్‌ లాంటి దర్శకుల సినిమాల గురించి ఆయన పలుమార్లు ప్రస్తావించడమే కాకుండా, వాటినుంచి తనకు తెలిసిన కొత్త విషయాలను కూడా పంచుకుంటుంటారు.

ఇటీవల రాజమౌళికి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. రాజమౌళి ఓ సక్సెస్‌ఫుల్ సినిమా ఎలా తీయాలి అనే అంశంపై ఒక పుస్తకం రాస్తున్నారని, అయితే బిజినెస్‌మెన్ సినిమా చూసిన తర్వాత ఆ పుస్తకాన్ని చించేసినట్లు చెప్పారు. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆ చిత్రం చూసిన వెంటనే రాజమౌళి తన సినిమా విజయాన్ని కొలిచే దృక్పథాన్నే మార్చుకున్నాడు. పూరి చూపించిన హీరో క్యారెక్టర్, కథనాన్ని బట్టి కండిషన్స్ పెట్టుకుని సినిమా తీయాల్సిన పనిలేదన్న భావన ఆయనలో అలవడిందట. ఆ అనుభవం తర్వాత తన దర్శకత్వంలో కొన్ని కీలకమైన మార్పులు చేశారని సదరు వ్యక్తి పేర్కొన్నారు.

ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న మల్టీ నేషనల్ యాక్షన్ అడ్వెంచర్‌పై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాపై ఇప్పటివరకు రాజమౌళి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వకపోయినా, ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందనున్న ప్రాజెక్ట్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది.

Read More

One thought on “జక్కన్న మేకింగ్‌ మారింది.. కారణం పూరి సినిమా!

Comments are closed.