పులివెందుల రీపోలింగ్‌పై అవినాష్ రెడ్డి విమర్శలు

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో రెండు పోలింగ్ బూత్‌లలో ఈరోజు రీపోలింగ్ జరుగుతోంది. నిన్న జరిగిన పోలింగ్‌లో అవకతవకలు జరిగాయన్న వైసీపీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీపోలింగ్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన ఆయన, నిన్న జరిగిన పోలింగ్‌లో అన్ని బూత్‌లలో అవకతవకలు జరిగాయని, కానీ ఎన్నికల సంఘం మాత్రం రెండు బూత్‌లకే పరిమితం అవ్వడం అన్యాయం అని విమర్శించారు. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని, పులివెందులలో కొత్త రీతిన అవకతవకలు జరిగే సంస్కృతిని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చారని ఆరోపించారు.

అవినాష్ రెడ్డి, రీపోలింగ్‌ను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ రీపోలింగ్ మొత్తం ఒక రాజకీయ నాటకం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. 15 బూత్‌లలో దొంగ ఓట్లు వేసిన ఘటనలు జరిగాయని, ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఓటర్ల వద్ద నుంచి స్లిప్‌లు తీసుకుని, తామే ఓటు వేశారని ఆయన ఆరోపించారు.

Read More : పులివెందుల ZPTC ఉప ఎన్నిక: రెండు కేంద్రాల్లో రీపోలింగ్