అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం శంకుస్థాపన.

అమరావతి రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. తుళ్లూరు–పెదపరిమి మధ్య 6.8 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ భూమిపూజ నిర్వహించారు. ఈ స్మృతివనంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం, మినీ థియేటర్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, “గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం అందించారు. అందుకే ఆయనను ‘ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్’గా గౌరవిస్తారు” అన్నారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసిన 58 రోజులకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం నిర్మిస్తున్నామని తెలిపారు. పాదయాత్రలో ఆర్యవైశ్య సోదరులకు ఇచ్చిన హామీ మేరకు ఈ స్మృతివనం కోసం ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, “ఈ గొప్ప కార్యక్రమానికి టీజీవీ గ్రూప్ తరఫున రూ.కోటి విరాళం అందిస్తున్నాం” అని ప్రకటించారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ, సీఆర్డీఏ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ మాట్లాడుతూ, “వచ్చే ఏడాది మార్చి 16న విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం” అని ప్రకటించారు. అనంతరం మంత్రి లోకేశ్‌ పొట్టి శ్రీరాములు వారసులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More : శ్రీజ వివాహానికి బాలయ్య హాజరు ?

One thought on “అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం శంకుస్థాపన.

Comments are closed.