ఒడిశాలో బాలికపై దారుణం: సజీవంగా పూడ్చే యత్నం

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో మానవత్వాన్ని సిగ్గుపడే ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై ఇద్దరు సోదరులు పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె ఐదు నెలల గర్భవతి అని తెలిసిన తరువాత నేరాన్ని దాచిపెట్టేందుకు సజీవంగా పూడ్చిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులు భాగ్యధర్ దాస్, పంచనన్ దాస్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడు తులు పరారీలో ఉన్నాడు.

బనశ్బార గ్రామానికి చెందిన ఈ సోదరులు బాలికపై అనేక రోజులుగా లైంగిక దాడి జరిపినట్లు పోలీసులు తెలిపారు. గర్భవతిగా మారిన విషయం బయటపడిన తరువాత నిందితులు నేరాన్ని దాచిపెట్టేందుకు భయంకరమైన పథకం రచించారు. అబార్షన్ చేయిస్తామని నమ్మబలికి ఒక నిర్జన ప్రదేశానికి పిలిపించి, ముందుగానే తవ్విన గొయ్యి వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి గ్రహించిన బాలిక షాక్‌కు గురైనప్పటికీ, ధైర్యం చేసి వారి బారి నుంచి తప్పించుకొని తన తండ్రికి వివరించింది.

తండ్రి ఫిర్యాదు మేరకు కుజంగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైద్య పరీక్షల్లో బాలిక ఐదు నెలల గర్భవతిగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న తులును పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

జగత్‌సింగ్‌పూర్‌లో ఇది ఈ వారంలో రెండో లైంగిక దాడి ఘటన. మంగళవారం ఒక బాలిక బర్త్‌డే పార్టీ నుంచి తిరిగి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి పొలంలో అత్యాచారం చేశారు. మల్కనగిరి జిల్లాలో కూడా మరో బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడగా, అనంతరం ట్రక్ డ్రైవర్ మళ్లీ అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలు ఒడిశాలో పెరుగుతున్న లైంగిక దాడులపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Read More : డ్రగ్స్ పై తీవ్ర దుమారం రేపిన కంగనా రనౌత్ వ్యాఖ్యలు..!