ఒకే నెలలో 20 బిలియన్ల లావాదేవీలు..

భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) చారిత్రక రికార్డు సృష్టించింది. చరిత్రలో తొలిసారి ఒకే నెలలో 20 బిలియన్ల (2000 కోట్ల) లావాదేవీల మార్కును దాటింది. ఈ గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సోమవారం ప్రకటించింది.

NPCI వివరాల ప్రకారం, ఆగస్టు నెలలో మొత్తం 20.01 బిలియన్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. జూలైలో నమోదైన 19.47 బిలియన్లతో పోలిస్తే ఇది 2.8% వృద్ధి. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ వృద్ధి 34%గా ఉంది. లావాదేవీల విలువ పరంగా ఆగస్టులో రూ. 24.85 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్లు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 24% పెరుగుదల. సగటున రోజుకు 645 మిలియన్ల లావాదేవీలు జరుగుతున్నాయని NPCI వెల్లడించింది.

గత కొన్ని నెలలుగా యూపీఐ లావాదేవీలు స్థిరంగా పెరుగుతున్నాయి. జూన్‌లో 18.40 బిలియన్ల లావాదేవీలు (రూ. 24.04 లక్షల కోట్లు) నమోదుకాగా, జూలైలో అవి 19.47 బిలియన్లకు (రూ. 25.08 లక్షల కోట్లు) చేరాయి. ఈ వేగాన్ని కొనసాగిస్తూ ఆగస్టు 2న ఒక్క రోజే 700 మిలియన్ల లావాదేవీలు జరగడం మరో రికార్డుగా నిలిచింది.

ఇక ఎస్బీఐ రీసెర్చ్ తాజా నివేదిక ప్రకారం, డిజిటల్ చెల్లింపుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. జూలైలో మొత్తం లావాదేవీల్లో మహారాష్ట్ర వాటా 9.8% కాగా, కర్ణాటక (5.5%), ఉత్తరప్రదేశ్ (5.3%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ప్రత్యేకంగా వినియోగదారుల నుంచి వ్యాపారులకు జరిగే (P2M) చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. 2020 జూన్‌లో మొత్తం లావాదేవీల్లో వీటి వాటా 39% ఉండగా, 2025 జూలై నాటికి అది 64%కి పెరిగింది. నగదు చలామణి (CIC) కంటే యూపీఐ లావాదేవీల వృద్ధి చాలా వేగంగా ఉందని, ఇది దేశ ఆర్థిక సమ్మిళితత్వానికి నిదర్శనమని నివేదికలో పేర్కొన్నారు. కిరాణా కొనుగోళ్లు, రుణ వసూళ్ల వంటి విభాగాల్లో యూపీఐ వినియోగం అధికంగా ఉందని స్పష్టమైంది.

Read More : యాపిల్ నుంచి సరికొత్త ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ AI ఫీచర్స్.