భారత క్రికెటర్ల జాబితాలో మరో కీలక మైలురాయికి చేరుకున్న మహేంద్ర సింగ్ ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ, తన టీ20 కెరీర్‌లో మరో కీలక మైలురాయికి చేరువయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో ధోనీ 400వ టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు.

ఈ అరుదైన ఘట్టాన్ని సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా ధోనీ నిలవబోతున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో 400 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ 24వ స్థానంలో చేరనున్నాడు.

ఇప్పటికే భారత క్రికెటర్లైన రోహిత్ శర్మ (456 మ్యాచ్‌లు), దినేశ్ కార్తిక్ (412 మ్యాచ్‌లు), విరాట్ కోహ్లీ (408 మ్యాచ్‌లు) ఈ ఘనతను సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో ధోనీ కూడా చేరబోతున్నాడు.

ఈ 400వ మ్యాచ్‌తో పాటు, ధోనీ మరో ప్రత్యేకతను కూడా సొంతం చేసుకోబోతున్నాడు. 400 టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించబోతున్నాడు. ఇంతకుముందు, దినేశ్ కార్తిక్ మాత్రమే వికెట్ కీపర్‌గా ఈ ఘనతను సాధించారు.

Read More : నీరజ్ ఆహ్వానానికి నో చెప్పిన అర్షద్ నదీమ్