పాకిస్తాన్ ఆర్మీకి బిగ్ షాక్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీకి మరో బిగ్ షాక్ తగిలింది. పాక్ ఆర్మీ బస్సుపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఈ ఘటనలో 29 మంది సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక, బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA ).. గత ఆరు నెలల్లో 286 దాడులు నిర్వహించి 700 మందిని హతమార్చడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ ఆర్మీపై మరోసారి BLA దాడులపర్వం కొనసాగుతోంది. తాజాగా క్వెట్టా, కలాట్, జహు ప్రాంతాల్లో తాము దాడి చేశామని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. పాక్ ఆర్మీ ప్రయాణిస్తున్న వాహనంపై ఐఈడీ బాంబులతో దాడి చేసింది. దాడి సమయంలో పాక్ సైనికులు సహా 48 మంది బస్సులో ప్రయాణిస్తున్నారని ప్రకటించింది. దాడి సందర్భంగా 29 మంది పాక్ సైనికులు మృతి చెందినట్టు, పదులు సంఖ్యలో సైనికులు గాయపడినట్టు BLA తెలిపింది.

కాగా, పాకిస్తాన్ ఆర్మీకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. అనూహ్య దాడులకు పాల్పడుతూ పాక్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వేర్వేరు ఆపరేషన్లలో పాకిస్తానీ భద్రతా దళాలను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని BLA తెలిపింది. బలూచిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చే వరకు పాక్ సైన్యం తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే BLA దాడులు చేస్తోంది.